Mallikarjun Kharge | వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమిలో విభేదాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఒక్కొక్కరిగా కూటమిని వీడుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎన్డీయే కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ‘ఇండియా’ కూటమిలో విభేదాలు తొలగించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి నుంచి జేడీయూ వైదొలగడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. నితీశ్ కుమార్కు లేఖ రాశానని, ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ఖర్గే చెప్పారు. అయితే, నితీశ్ మనసులో ఏముందో తనకు తెలియదని అన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి పూర్తి సమాచారం తెసుకుంటానని చెప్పారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు.
ఇక కూటమిలో అందరినీ ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో తాను మాట్లాడినట్లు చెప్పారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మనం ఐక్యంగా ఉండాలని, అప్పుడే మంచి పోరాటం చేయగలమని వారితో చెప్పినట్లు ఖర్గే వివరించారు. ఇండియా కూటమి బాగా పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునే వారు తొందరపాటు నిర్ణయం తీసుకోరని ఈ సందర్భంగా ఖర్గే వ్యాఖ్యానించారు.
Also Read..
Mamata Banerjee | పెండింగ్ నిధులు వారంలోగా చెల్లించాలి.. మోదీ సర్కార్కు మమతా బెనర్జీ అల్టిమేటం
Nitish Kumar | ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?
Arvind Kejriwal | ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు