INDIA Bloc | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో ఇండియా కూటమిలో విబేధాలు ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ మధ్య స్వల్ప విబేధాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కావాలనుకుంటే జమ్మూ సీట్లను పీడీపీకి ఆఫర్ చేయొచ్చని సూచించారు. గతంలో గెలిచిన సీట్లను తాము త్యాగం చేయలేం. మేం కఠినం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని, దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు.
కశ్మీర్ వ్యాలీలోని మూడు లోక్సభ స్థానాల్లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తుందని వారం రోజుల క్రితమే ఆ పార్టీ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో మొత్తం ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి. కశ్మీర్ వ్యాలీలో ఉన్న మూడు స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలవగా, జమ్మూలో ఉన్న రెండు స్థానాల్లో బీజేపీ గెలించింది. లఢక్ ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీనే కైవసం చేసుకుంది.