అగర్తల: మ్యూజియంగా మారిన ప్రముఖ ప్యాలెస్లోని దర్బార్ హాల్లో జీ20 ప్రతినిధులకు విందు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు త్రిపురలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. జీ20 కూటమికి ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. అయితే దీనికి ముందు దేశంలోని ప్రముఖ నగరాల్లో పలు అంశాలపై జీ20 సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3న త్రిపుర రాజధాని అగర్తలలోని ప్రముఖ ఉజ్జయంత ప్యాలెస్ (Ujjayanta Palace) దర్బార్ హాల్లో జీ20 సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న జీ20 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు, నీతి ఆయోగ్ సిబ్బందికి అక్కడ డిన్నర్ ఏర్పాటు చేశారు.
కాగా, త్రిపురను పాలించిన మాణిక్య రాజవంశానికి చెందిన 122 ఏళ్ల నాటి ఉజ్జయంత కోటను 2013లో మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్ను గతంలో ఆ రాష్ట్ర అసెంబ్లీగాను వినియోగించారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఉజ్జయంత ప్యాలెస్లోని దర్బార్ హాల్లో జీ20 ప్రతినిధులకు విందు ఇవ్వడంపై కేంద్రం, త్రిపురలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ రాజ వంశ వారసురాలు, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) త్రిపుర చాప్టర్ కన్వీనర్ ఎంకే ప్రగ్యా దేబ్ బర్మన్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. దర్బార్ హాల్ కేవలం గది మాత్రమే కాదని, అది ఒక చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రదేశమని అన్నారు. ఈ దర్బార్ హాల్కు ఎంతో ప్రతిష్ట ఉందని, 122 ఏళ్లుగా ఎంతో గౌరవం పొందినట్లు ఆమె తెలిపారు. త్రిపుర పాలకుల పట్టాభిషేకం కోసం, పాలనా పరమైన ప్రయోజనాల కోసమే దీనిని ఇప్పటి వరకు వినియోగించినట్లు గుర్తు చేశారు.
అయితే ఎంతో ప్రాముఖ్యత ఉన్న చారిత్రక దర్బార్ హాల్లో ఇప్పటి వరకు ఎలాంటి వినోదం, విందు కార్యక్రమాలు జరుగలేదని ప్రగ్యా దేబ్ బర్మన్ తెలిపారు. దురదృష్టవశాత్తు దర్బార్ హాల్ ప్రతిష్ట, గుర్తింపును రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం మసకబారుస్తున్నదని విమర్శించారు. ఇది తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘శతాబ్దాల నాటి భారతీయ సంస్కృతి, దార్శనికులైన మహారాజులు, గొప్ప చారిత్రక గతాన్ని గౌరవిస్తున్నట్లు ఒకవైపు వారు (బీజేపీ నేతలు) మాట్లాడుతున్నారు. మరోవైపు పార్టీ సమావేశాలు, విందు కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. ఈ వంచనను ప్రజలు తెలుసుకోవాలి. వీటిని ఖండించాలి’ అని ఆమె దుయ్యబట్టారు.
Also Read: