కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ జైత్రయాత్రలో ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న మాల్దా, ముర్షీదాబాద్ కూడా టీఎంసీ వశమయ్యాయి. ముస్లిం ఆధిక్యత అధికంగా ఉన్న ఈ రెండు జిల్లాలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీనే ఆదరించేవి. ఈ రెండు జిల్లాల్లో గతంలో ఏనాడూ టీఎంసీకి పెద్దగా పట్టులేదు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలువలేదు. ముర్షీదాబాద్ జిల్లాలోని 22 స్థానాల్లోనూ కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకుంది. మాల్దాలో 12 స్థానాలకుగాను 7 స్థానాలను, ముర్షీదాబాద్లో 22 స్థానాల్లో 14 స్థానాలను దక్కించుకుంది.
2011 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీయే సత్తా చాటింది. కానీ, 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మొత్తం తారుమారైంది. మాల్దా, ముర్షీదాబాద్ జిల్లాల్లో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 34 స్థానాలకుగాను 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా 24 స్థానాల్లో టీఎంసీ తన ఖాతాలో వేసుకుంది. శంషేర్గంజ్, జంగీపూర్ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మరణించడంతో ఆ రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు టీఎంసీ వైపు ఎందుకు మళ్లినట్టు..?
అయితే, ఎప్పుడూ కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న మాల్దా, ముర్షీదాబాద్ జిల్లాలో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పాగా వేయడానికి గల కారణం ఏమై ఉంటుందనే విషయమై ఇప్పుడూ సర్వత్రా చర్చ జరుగుతున్నది. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్లో 66% జనాభా ముస్లింలే ఉన్నారు. ఎప్పుడూ కాంగ్రెస్ వెంట నిలిచే ఈ రెండు జిల్లాలు ఈసారి టీఎంసీని వైపు మళ్లడానికి కారణం బీజేపీయే అనే వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకంటే పశ్చిమబెంగాల్లో గతంలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండేది కాదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. అయితే ఈసారి తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన పోటీదారుగా బీజేపీ నిలిచింది. దాంతో ఈసారి అంతగా ప్రభావంలేని కాంగ్రెస్ పార్టీకి తాము ఓటు వేస్తే పరోక్షంగా బీజేపీ లబ్ధి చెందే అవకాశం ఉందని ముస్లిం ఓటర్లు భావించారు. అందుకే గంపగుత్తగా టీఎంసీ అభ్యర్థులకు ఓట్లు వేశారు.
అయినా ఆ రెండు జిల్లాలో బీజేపీ 8 స్థానాలు గెలిచింది. ముస్లిం ఓటర్లంతా టీఎంసీ వైపు మళ్లినా పరిస్థితి ఇలా ఉందంటే.. టీఎంసీ, కాంగ్రెస్ మధ్య ముస్లిం ఓటు చీలితే ఇంకెలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖపోరు వల్ల ముస్లిం ఓటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య చీలి బీజేపీ లాభపడింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి ముస్లిం ఓటర్లు తెలివిగా నిర్ణయం తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ సరసన టాలెంటెడ్ నటి..!
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!