ఇక, చాలు!
ఎప్పుడో కట్టే కొత్త ప్రాజెక్టులు తర్వాత..ముందు కరెంటు ఇవ్వండి..ఒకవైపు పండుగల సీజన్ అయిపోతుంది..బట్టల ఆర్డర్లు మస్తు పెండింగ్లో ఉన్నాయ్.కరెంటు లేక, కార్మికులు ఉత్తగనే ఉంటున్రు ఇలాగే ఆలస్యం చేస్తే, మా బతుకులు బజారు మీదకే
– కర్ణాటక కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతూ బళ్లారి జీన్స్ వ్యాపారులు చేస్తున్న విజ్ఞప్తి ఇది
Karnataka | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొదలైన విద్యుత్తు కోతలు అటు రైతులనే కాదు ఇటు పారిశ్రామికవర్గాలనూ కలవరపెడుతున్నాయి. ఒకవైపు పెరిగిన ముడి సరుకు ధరలు, మరోవైపు సుంకాల వాత.. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలు వెరసి ఇప్పటికే కుదేలైన కర్ణాటకలోని బళ్లారి జీన్స్ పరిశ్రమపై కాంగ్రెస్ సర్కారు తాజాగా విద్యుత్తు పోటు పొడిచింది.
రాష్ట్రంలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో జీన్స్ పరిశ్రమలో ఉత్పత్తి అంతకంతకూ పడిపోతున్నది. కొవిడ్-19 లాక్డౌన్ సంక్షోభంతో కుదేలైన పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నదని, ఇలాంటి సమయంలో అనధికారికంగా కరెంటు కోతలు విధించడం ఏమిటని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగ సీజన్లను దృష్టిలో పెట్టుకొని వేల కోట్ల విలువైన ఆర్డర్లను ఇప్పటికే ఒప్పుకొన్నామని, ఇలాంటి సమయంలో విద్యుత్తు కోతలు విధిస్తే, బట్టలను ఎలా డెలివరీ చేస్తామని మండిపడుతున్నారు.
రాక-పోక తెలిస్తేగా?!
పగటిపూట 6-12 గంటలపాటు, రాత్రిళ్లు దాదాపు పూర్తిగా కరెంటు కోతలు విధిస్తున్నట్టు చిన్న పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. దీంతో మానవవనరుల వినియోగం వృథాగా పోతున్నట్టు మండిపడుతున్నారు. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదని చెబుతున్నారు. అటు పరిశ్రమలో పనిచేసే కార్మికులూ జీతాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు నెలకు ఇంతా అన్నట్టు వేతనం ఉండబోదని, రోజుకు సగటున 300-400 జత ప్యాంట్లను పూర్తిచేస్తేనే ఆ రోజు వేతనం పడుతుందని చెబుతున్నారు. ఇప్పుడు విద్యుత్తు కోతలతో పైసా కూడా రావట్లేదని వాపోతున్నారు. వచ్చే బడ్జెట్లో రూ. 5000 కోట్లతో బళ్లారిలో జీన్స్ పార్క్ ప్రారంభిస్తామని కాంగ్రెస్ సర్కారు ఆశలు చూపెడుతున్నదని, అయితే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికంటే ముందు విద్యుత్తు కోతల సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
గతమెంతో వైభవం
అప్పటివరకూ బెల్బాటమ్, ప్యారెలాల్ ప్యాంట్లనే ధరించిన భారతీయులకు జీన్స్ను పరిచయం చేసిన వాటిలో బళ్లారి జీన్స్ పరిశ్రమ ఒకటి. బళ్లారి ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువ. ఇక్కడి నుంచి దక్షిణాదిలోని అనేక ప్రాంతాలకు రైలు సదుపాయం ఉంది. ఈ కారణంగానే బ్రిటిష్ పాలకులు సైన్యానికి ఇక్కడి నుంచి యూనిఫామ్లు కుట్టించి పంపేవారు. కాలగమనంలో రెడీమేడ్ దుస్తుల తయారీ కూడా ప్రారంభమైంది. తర్వాత ఇక్కడి వర్కర్లు వెస్టర్న్ ైస్టెల్ జీన్స్ పాంట్లు, చొక్కాల తయారీ ప్రారంభించారు. వీటి విక్రయాలు గణనీయంగా పుంజుకొన్నాయి.
అయితే, చిన్న యంత్రాలతో ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుండటంతో పరిశ్రమ నవీకరణకు, పెద్ద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం ముందుకురావాలని ఇక్కడి కార్మికులు 2017, 2018లో కేంద్రప్రభుత్వానికి, పరిశ్రమల శాఖకు వినతి పత్రాలు అందించారు. అయితే, దీన్ని పట్టించుకోని కేంద్రం.. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో జీన్స్ అపారెల్ పార్కును ప్రారంభించింది. ఈ దెబ్బతో కుదేలైన బళ్లారి జీన్స్ పరిశ్రమపై కరోనా సంక్షోభం మరింత ప్రభావం చూపింది. లాక్డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న పరిశ్రమపై కరెంటు కోతల రూపంలో కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసింది.
రోడ్డున పడటం ఖాయం
బళ్లారి జీన్స్ తయారీ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 వేల నుంచి 80 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. కొవిడ్ లాక్డౌన్, కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి తగిన ప్రోత్సాహకం లేకపోవడం, పెరిగిన ముడి సరుకు ధరలు, సుంకాలు వెరసి గడిచిన రెండు, మూడేండ్లలోనే జీన్స్ ఉత్పత్తి, అమ్మకాలు 40% వరకూ తగ్గాయి. ఈ పండుగ సీజన్లోనైనా నాలుగు రాళ్లు వెనుకేసుకుందామంటే, రాష్ట్రంలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలు మా ఆశలను అడియాశలు చేస్తున్నాయి. నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి. లేకపోతే, వేల కుటుంబాలు రోడ్డున పడటం ఖాయం.
-పోలక్స్ మల్లికార్జున, జీన్స్ వ్యాపారి, బళ్లారి, కర్ణాటక