లఢఖ్: కేంద్రపాలిత ప్రాంతమైన లఢఖ్లోని లేహ్ ప్రాంతం మాంచి టూరిస్ట్ స్పాట్. ఎత్తయిన పర్వతాలు, పచ్చని పచ్చిక బయళ్లు, లోయలు, కొండలతో లేహ్ ప్రాంతం సర్వాంగ సుందరంగా కనిపిస్తుంటుంది. అందుకే కశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చే సందర్శకులు లేహ్ ప్రాంతాన్ని కూడా తప్పక సందర్శిస్తారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లు పర్యాటకులను అనుమతించకపోవడంతో లేహ్ ప్రాంతం వెలవెలబోయింది.
కానీ, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో లఢఖ్ అధికార యంత్రాంగం కొవిడ్ నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదంటే కొవిడ్ నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టు రిపోర్టును సమర్పించిన వారు లేహ్లో పర్యటించేందుకు అనుమతించింది. దాంతో ఇప్పుడు లేహ్ వీక్షణకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. బైక్పై లఢఖ్కు రావాలన్నది తన కల అని, ఇన్నాళ్లకు తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా టూరిస్ట్ చెప్పారు.
లఢఖ్ అందాలను ఎంత చూసినా తనివి తీరదని, ఇక్కడి రోడ్లు చాలా చక్కగా ఉన్నాయని ముంబైకి చెందిన ఐశ్వర్య అనే మరో మహిళా టూరిస్టు వ్యాఖ్యానించారు. లఢఖ్ను సందర్శించాలనుకునే వారు తప్పనిసరిగా కొవిడ్ రూల్స్ పాటించాలని ఆమె తోటి పర్యాటకులకు సూచించారు.