Kerala blasts | కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల (Kerala blasts ) ఘటనలో మరో మరణం నమోదైంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలిక సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది.
బాలిక మలయత్తూర్కు చెందిన లిబినాగా అధికారులు గుర్తించారు. కలమసేరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. బాలిక 95 శాతం తీవ్రంగా కాలిన గాయాలతో ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ బాలిక పరిస్థితి క్షీణించడంతో ఆదివారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో మరణించినట్లు ఆసుపత్రి మెడికల్ బోర్డు వెల్లడించింది. దీంతో బాలిక మరణంతో ఈ ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3కు పెరిగింది.
కాగా, కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలమస్సేరి (Kalamassery)లోని ‘జెహోవా విట్నెసెస్’ అనే క్రైస్తవ మత గ్రూపు (Christian group Jehovah’s Witnesses ) ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. కన్వెన్షన్ హాలులో ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లు జరిగాయి. టిఫిన్ బాక్స్లో అమర్చిన ఐఈడీ పదార్థంతో పేలుళ్లు జరిపినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆదివారం ఉదయం 9.40 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని రాష్ట్ర డీజీపీ దర్వేశ్ సాహెబ్ వెల్లడించారు. పేలుడు సమయంలో కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 2,300 మంది ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించగా.. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read..
Anju | పాక్ నుంచి భారత్కు రానున్న అంజు.. ఎన్వోసీ కోసం దరఖాస్తు
Joe Biden | గాజాలోని పౌరులను రక్షించండి.. ఇజ్రాయెల్కు బైడెన్ సూచన