Joe Biden | హమాస్ (Israel- Hamas War) లక్ష్యంగా గాజా (Gaza) స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో ఇజ్రాయెల్ భీకర యుద్ధం సోమవారం 24వ రోజుకు చేరుకుంది. హమాస్ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ భద్రతా బలగాలు (ఐడీఎఫ్) గాజాపై ముప్పేట దాడి చేస్తున్నాయి. భూతల, వైమానిక దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో గాజాలోని అమాయక ప్రజలను రక్షించాలని (Protect Civilians ) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సూచించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu )తో బైడెన్ ఫోన్లో మాట్లాడారు.
హమాస్ మిలిటెంట్లు, పౌరుల మధ్య తేడాను గుర్తించాలని బైడెన్ కోరారు. ఈ యుద్ధంలో గాజాలోని ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా రక్షించాలని సూచించారు. పౌరుల రక్షణకు ప్రధాన్యతనిచ్చే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని.. అదే సమయంలో పౌరులకు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు.
యుద్ధం కారణంగా గాజా గజగజ వణికిపోతోంది. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో అక్కడ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆహారం, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. ఆహార సంక్షోభం చుట్టుముడుతున్నది. ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది ప్రజలు ఐక్యరాజ్యసమితి గోదాముల్లోకి చొరబడి ఆహార, ఇతర నిత్యావసర పదార్థాలను ఎత్తుకెళ్లారు. గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం గాజా డైరెక్టర్ థామస్ పేర్కొన్నారు.
సొంత బలగాలను ఉద్దేశంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. హమాస్ దాడిని గుర్తించడంలో ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని, దాడి గురించి భద్రతాధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై క్యాబినెట్ సహచరులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవడంతో ఆయన భద్రతా బలగాలకు క్షమాపణలు చెప్పారు.
Also Read..
Anju | పాక్ నుంచి భారత్కు రానున్న అంజు.. ఎన్వోసీ కోసం దరఖాస్తు
ప్రపంచంలోనే తొలి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ