Israeli PM Netanyahu | పాలస్తీనాలోని హమాస్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులతో విరుచుకు పడుతున్నది. హమాస్కు చెందిన కీలక కమాండర్లను అంతమొందించామని ఇజ్రాయెల్ సైన్యాలు తెలిపాయి. ఇదిలా ఉంటే తాము రెండో దశ యుద్ధంలోకి వెళ్లామని ప్రకటించిన ఇజ్రాయెల్ నెతన్యాహూ.. సొంత సైనిక బలగాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల ఏడో తేదీన హమాస్ దాడిని గుర్తించడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని నెతన్యాహూ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. దాడికి సంబంధించి భద్రతాధికారులు కూడా ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ఆయన సహచర మంత్రులు, రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నెతన్యాహూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. భద్రతా బలగాలకు క్షమాపణ చెప్పడంతోపాటు వారికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ విపక్ష నేత యైర్ ల్యాపిడ్ ఆక్షేపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా దళాలపై నింద మోపడాన్ని తప్పు పట్టారు. ప్రధాని నెతన్యాహూ తీరు బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. హమస్, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ భద్రతా బలగాలకకు మద్దతుగా నిలవాల్సిన సమయంలో వాటి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలుచేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు.