న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కేవలం ఇద్దరు వ్యాపారులను అభివృద్ధి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. విమానాశ్రయాలు (Airports), ఓడరేవులు (Ports), ప్రభుత్వ రంగ సంస్థల (PSUs) ను మోదీ సర్కారు వాళ్లకే ధారాదత్తం చేస్తోందని ఆమె విమర్శించారు. దేశంలో బడా వ్యాపారులైన గౌతమ్ అదానీ (Goutham Adani), ముకేశ్ అంబానీల (Mukesh Ambani) పేర్లను నేరుగా ప్రస్తావించకుండా వాళ్లను ఉద్దేశించి ప్రియాంకాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కానీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ఆ ఇద్దరు బడా వ్యాపారులు గానీ, కేంద్ర సర్కారు గానీ నిరుద్యోగుల కోసం ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం లేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. వాళ్లకో లక్ష్యం, ప్రణాళిక అనేవి బొత్తిగా లేకుండా పోయాయని ఆమె విమర్శించారు. మోదీ ముళ్లె ఖాళీగా ఉన్నదని, కానీ ఆయన మాత్రం అనుచిత హామీలతో ఊదరగొడుతున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడారని, కానీ అది పదేళ్ల తర్వాత అమలవుతుందని ప్రియాంకాగాంధీ తెలిపారు. ఆయన కుల గణన ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు గురించి హామీ ఇచ్చిన కేంద్రం.. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కోసం చేసేందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని, కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పారు.