కోల్కతా : కాషాయ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో కూటమి ఏర్పాటుకు చొరవ చూపని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్కే పరిమితమైందని టీఎంసీ దుయ్యబట్టింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని టీఎంసీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ట్వీట్లతోనే కాలం గడుపుతోందని పార్టీ పత్రిక జాగో బంగ్లాలో టీఎంసీ రాసుకొచ్చింది. 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరుతో సతమతమవుతూ మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టలేని స్ధితిలో కొట్టుమిట్టాడుతోందని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సవాళ్లు పెచ్చుమీరాయని వ్యాఖ్యానించింది. బీజేపీని ఎలా మట్టికరిపించాలో బెంగాల్ ఎన్నికల్లో తాము ఓ దారి చూపించామని టీఎంసీ స్పష్టం చేసింది. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గోవా పర్యటన నేపధ్యంలో టీఎంసీ కాంగ్రెస్పై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపాలని యోచిస్తున్న టీఎంసీ జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతోంది.