ముంబై, మే 30: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు ఇప్పటివరకూ రూ. 17,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయని, అందులో రూ.14,000 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్కాగా, రూ. 3,000 కోట్ల నోట్లను మార్పిడి చేశామని బ్యాంక్ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా మంగళవారం తెలిపారు. రూ.2000 నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్బ్యాంక్ మే 19న ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా ట్రెండ్ ప్రకారం బ్యాంక్ శాఖలకు అందుతున్న రెండు వేల నోట్లలో 80 శాతం వరకూ డిపాజిట్ చేస్తున్నారని, 20 శాతం నోట్లను తక్కువ విలువగల నోట్లలోకి మార్చుకుంటున్నారని ఎస్బీఐ రీసెర్చ్ వింగ్ ఎకోరాప్ వెల్లడించింది. ఈ డిపాజిట్ల కారణంగా మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ల పరంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తమ గత అంచనా ఒక లక్ష కోట్లకంటే గణనీయంగా పెరుగుతుందని ఎకోరాప్ పేర్కొంది. ప్రస్తుత సమాచారం మేరకు ఈ అంచనాల్ని వెల్లడిస్తున్నామని తెలిపింది.