BJP | హైదరాబాద్, ఏప్రిల్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రానున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది. ఇందులో 116 మంది (28 శాతం) 2014 తరువాత ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరి టికెట్ పొందినవారే. ఈ మేరకు ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ది ప్రింట్’ ఓ కథనంలో వెల్లడించింది.
బలహీనంగా ఉన్న రాష్ర్టాల్లో పార్టీని విస్తరించాలన్న ఉద్దేశంతో ఇతర పార్టీల్లోని కీలక నేతలను బీజేపీ చేర్చుకొని టికెట్లు కట్టబెడుతున్నది. దీంతో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి అధిష్ఠానం వైఖరి ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. ఫలితంగా మోదీ స్వరాష్ట్రం గుజరాత్ సహా పలు రాష్ర్టాల్లో కార్యకర్తలు అధిష్ఠానం తీరును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. అశోక్ తన్వార్ (సిర్సా), సీతా సొరేన్ (దుమ్కా), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర) వంటి 33 మంది నేతలు ఒకటి ఇటీవలే పార్టీలో చేరారని, అలాంటి వాళ్లకు టికెట్లు కేటాయించడమేంటని పలువురు సీనియర్ బీజేపీ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏండ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్నవారిని ఇది మోసగించడమేనని మండిపడుతున్నారు.
బీజేపీలోకి ఏ పార్టీ నుంచి ఎంతమంది?
116-బీజేపీలో టికెట్ పొందిన కొత్తగా వచ్చిన నేతలు