సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు వరుణుడు అడ్డుపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగాల్సిన టెస్టు మ్యాచ్ తొలి రోజు వర్షార్పణమైంది. శుక్రవారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో ఏజెస్ బౌల్ స్టేడియం చెరువును తలపించింది. దీంతో తొలి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ విరామం తర్వాత అయినా తిరిగి మ్యాచ్ ఆరంభమవుతుందేమోనని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉన్నా.. భారీ వర్షం కావడంతో ఔట్ఫీల్డ్ ఆటకు అనుకూలంగా లేదని భావించిన అంపైర్లు పలుమార్లు పరిశీలించిన అనంతరం తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.