ఇసుక వ్యాపారంలో నష్టం వచ్చిందని.. దాని నుంచి బయటపడేందుకు తక్కువ ధరలో వాహనాలను విక్రయిస్తామని నమ్మించి.. మోసం చేస్తున్న ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన పరుచూరి శ్రీకాంత్ స్థానికంగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. అందులో నష్టం రావడం, అతడి విలాసవంతమైన జీవనానికి డబ్బులు లేకపోవడంతో ఆన్లైన్లో ప్రకటనలు వేసి.. తక్కువ ధరకు బీఎస్-4 వాహనాలను విక్రయిస్తామని నమ్మించాడు. దీని కోసం వ్యాపారం నేపథ్యంలో తరచుగా మధ్యప్రదేశ్ భూపాల్ పట్టణానికి వెళ్లే శ్రీకాంత్కు.. అక్కడ అంకిత్ జైన్, అమన్పటేల్ పరిచయమయ్యారు. అమన్ పటేల్తో సిమ్ కార్డులు తెప్పించి.. ప్రకటనల్లో ఆ ఫోన్ నంబర్లను పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైన ఆసక్తి చూపితే.. వారిని మాయ చేసి.. వారి నుంచి నగదును రాబట్టి.. ఆ తర్వాత స్పందించరు. అనంతరం ఆ సిమ్లను ధ్వంసం చేస్తారు.
ఇలా వీరి ప్రకటనను చూసిన రాచకొండ పోలీస్ కమిషనరేట్కు చెందిన ఓ బాధితుడు ఆసక్తి చూపి బీఎస్-4 వాహనాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడిని నమ్మించి వాహనం చూపించకుండానే ముందుగా రూ.1.86 లక్షలు తీసుకుని ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఈ ముగ్గురు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.