Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ (Intelligence) వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం కానున్న ఈ అమర్నాథ్ యాత్రకు భద్రతను మరింత పటిష్టం చేసింది. పాకిస్థాన్ (Pakistan) లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) భారత్లో అలజడి సృష్టించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు తెలిపాయి.
ముఖ్యంగా అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, జమ్ముకశ్మీర్లో అడవుల్లో దాక్కున్న కొంతమంది ఉగ్రవాదులతో పాక్ మూకలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పెద్దఎత్తున దాడులు జరిపేలా వారిని ప్రేరేపించే యత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో యాత్ర మార్గంలో భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించారు. ఉగ్రవాద వ్యతిరేక నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. అత్యాధునిక కృత్రిమ మేథ ఆధారిత కెమెరాలు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటుచేశారు. యాత్రికుల భద్రతకు ఎలాంటి లోటులేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. బలగాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, యాత్రికులు కూడా అధికారిక సూచనలు పాటించాలని, వదంతులను నమ్మవద్దని భద్రతా వర్గాలు సూచిస్తున్నాయి.