Self Employment | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యను అభ్యసించాలి.. చిన్నదో.. పెద్దదో.. ప్రైవేట్ రంగమో.. ప్రభుత్వ సంస్థనో ఏదో ఒక వైట్కాలర్ ఉద్యోగం చేయాలి. ఇదీ నిన్నటి వరకూ యువతరం ఆలోచన. కానీ కరోనా మహమ్మారి యువత ఆలోచనా ధోరణిలో పెనుమార్పులు తెచ్చింది. స్వయం ఉపాధి వైపు వారిని ప్రేరేపిస్తున్నది. కరోనా నేపథ్యంలో అనేక ప్రైవేట్ కంపెనీలు లక్షల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం, జీతాల్లో భారీగా కోతలు విధించడం ఇందుకు కారణం.
ప్రైవేట్ రంగంలో ఎంతకాలం చేసినా ఎదుగూ బొదుగూ లేని జీవితం. ఉద్యోగ భద్రత కరువు. అధిక పని గంటలు. ఇలాంటివన్నీ యువత ఆలోచనలను మార్చేస్తున్నాయి. దీంతో స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. స్థానికంగా ఉన్న వనరులు, ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా స్థిరంగా ఉండే వ్యాపారాలపైనే ఆసక్తి చూపుతున్నారు. ‘భారతదేశంలో మహిళలు, పురుషులు-2022’ పేరిట నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) ఇటీవల విడుదల చేసిన నివేదిక యువత ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పులకు దర్పణం పడుతున్నది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఎకువ మంది పురుషులు, మహిళలు స్వయం ఉపాధికే మొగ్గుచూపుతున్నారని ఆ రిపోర్టు స్పష్టం చేసింది.