(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగా భర్తీ చేయట్లేదు. ఇండియన్ రైల్వే బోర్డ్, నేషనల్ డెయిరీ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ), లా కమిషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తదితర సంస్థల్లో చైర్మన్ స్థాయి పోస్టులను ప్రధానమంత్రి, హోంమంత్రి సభ్యులుగా గల క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) నియమించాలి. అయితే, ఇది జరుగడం లేదు. రైల్వే బోర్డు, ఎన్డీడీబీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ వంటి సంస్థల్లో ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించి తాత్కాలిక చైర్పర్సన్లుగా కొనసాగిస్తున్నారు.
పీఎస్యూల్లోని టాప్ పోస్టుల భర్తీ కోసం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ) అర్హులైనవారి జాబితాను ఏసీసీకి పంపడం ఆనవాయితీ. అయితే, గత కొన్నేండ్లుగా పీఈఎస్బీ పంపిన జాబితాలో ప్రతిపాదించిన వ్యక్తులు సదరు పోస్టులకు అర్హులు కాదంటూ ఏసీసీ ఏవేవో కారణాలు చెప్తూ జాబితాను వెనక్కి పంపుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో గత కొన్నేండ్లుగా పీఎస్యూల్లోని చైర్మన్ స్థాయి పోస్టులు ఖాళీగా ఉంటున్నట్టు పేర్కొన్నాయి. ప్రపంచంలోని దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు భారత సంతతి వ్యక్తులు సీఈవోలుగా పనిచేస్తున్నప్పుడు.. పీఎస్యూలకు అర్హత కలిగిన వ్యక్తులు దొరకడం లేదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో సేవలందించిన మాజీ కార్యదర్శులు ఎందరో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. సంస్థలను లాభాల బాటలో తీసుకెళ్లడానికి దిశానిర్దేశం చేసే టాప్ ర్యాంకు పోస్టుల్లో నియామకాలను ఆపితే, ప్రభుత్వ సంస్థలు నష్టాల బారినపడే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. పీఎస్యూలను నష్టాల పాలుజేసి, వాటిని తెగనమ్మడానికి బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నియామకాలను అడ్డుకొంటున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.