న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: విపత్తు సాయం కింద రావాల్సిన నిధుల్ని విడుదల చేయకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రకృతి వైపరిత్యాల కింద రాష్ర్టానికి రావాల్సిన (ఎన్దీఆర్ఎఫ్) ఈ నిధుల్ని కేంద్రం నుంచి ఇప్పించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది.
మధ్యంతర సాయం కింద రూ.2,000 కోట్లు విడుదల చేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని దావాలో అభ్యర్థించింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో దావా వేసింది. మిచాంగ్ తుఫాన్, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ర్టానికి విపత్తు సాయం కింద కేంద్రం నుంచి రూ.37,000 కోట్లు అందజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది.