న్యూఢిల్లీ, అక్టోబర్ 4: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కేసు దర్యాప్తు సందర్భంగా నిందితులపై ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, సంస్థ పనితీరు పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఈడీకి సూచించింది. ఈడీ వ్యవహారం ఏకపక్షంగా, పక్షపాతంగా ఉన్నట్టు కనిపిస్తున్నదని పేర్కొంది. గురుగ్రామ్కు చెందిన ఓ కంపెనీపై దాఖలైన హవాలా కేసులో.. ఆ కంపెనీ డైరెక్టర్లు బసంత్ బన్సల్, పంకజ్ బన్సల్ అరెస్టును కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితులను అరెస్టు చేయడానికి ముందు.. విధిగా వారిని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో లిఖితపూర్వంగా తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులకు వారి అరెస్టుకు గల కారణాలను తెలియజేయకపోవడంపై కోర్టు ఈడీని తీవ్రస్థాయిలో మందలించింది.
అరెస్టుకు గల కారణాలను నిందితుల ముందు చదవడం కాదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1), హవాలా (పీఎంఎల్ఏ) చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం రాతపూర్వక ప్రతిని వారికి అందించాలి అని స్పష్టం చేసింది. ఈ కేసులో పరిణామాలు ఈడీ ప్రతికూల పనితీరుకు నిదర్శనంగా ఉన్నాయని పేర్కొంది. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కారణంతో అరెస్టు చేయడం సరికాదని తెలిపింది. ‘హవాలా చట్టం కింద వారు నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు సేకరించి అరెస్టు చేయాలి. అంతేగానీ, సమన్లకు స్పందించలేదన్న కారణంతో అరెస్టు చేయకూడదు’ అని పేర్కొంది. ఈ కేసులో బన్సల్ సోదరులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. హవాలా చట్టాన్ని సవరించడం ద్వారా ఈడీకి అసాధారణ అధికారాలను కట్టబెట్టారు. బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడేందుకు ఈడీని పావుగా వాడుకుంటున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.