న్యూఢిల్లీ, నవంబర్ 11: ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం రెండుమార్లు సిఫారసు చేసిన పేర్లను కూడా తొక్కిపెట్టడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ అసాధారణమైన జాప్యం వల్ల జడ్జీలుగా సిఫారసు చేయబడినవారు నిరుత్సాహంతో వెనుకకు తగ్గుతున్నారని తెలిపింది. సమర్థులైన న్యాయాధికారులు ధర్మాసనాలను అధిష్టించలేకపోతున్నారని, ఇది చట్టం, న్యాయం అన్న భావనలను ఇబ్బందులకు గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. కొలీజియం సిఫారసులను మూడు నుంచి నాలుగు వారాల్లో అమలు చేయాలని గత ఏడాది ఇచ్చిన ఆదేశాలను ఐదువారాలు గడిచినా పట్టించుకోకపోవడం ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా భావించాల్సి వస్తున్నదని పేర్కొన్నది. హైకోర్టులకు జడ్జీల నియామకాల్లో ‘అసాధారణమైన జాప్యం’ జరుగుతున్నదని, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర ప్రతిపత్తికి ఇది హానికరం అని పేర్కొంటూ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి నోటీసు..
ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా నియమించడానికి సిఫారసు చేసిన కొంతమంది పేర్లను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇలా పేర్లను పెండింగ్లో పెట్టడం ప్రభుత్వానికి ‘ఒక రకమైన సాధనం’గా మారిపోయిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉన్నత న్యాయస్థానాలకు జడ్జీలుగా ఎంపికైనవారు తమంతట తాముగా వెనుకకు తగ్గేలా నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం ఈ ‘సాధనాన్ని’ వాడుకుంటున్నదని పేర్కొంది. ‘పేర్లను అలా పెండింగ్లో పెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. న్యాయమూర్తులను సకాలంలో నియమించడానికి నిర్దిష్టమైన గడువు విధిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ‘ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘిస్తున్నది’ అని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసు జారీచేసింది.
రెండోసారి సిఫారసు చేసినా..
కొలీజియం 11 మంది పేర్లను తొలుత సిఫారసు చేసి, ఆ తరువాత అవే పేర్లను పునరుద్ఘాటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు వారిని జడ్జీలుగా నియమించలేదని ధర్మాసనం ఆక్షేపించింది. ‘ఈ విధమైన జాప్యం వల్ల జడ్జీలుగా ఎంపికైనవారు తమ సమ్మతిని వెనుకకు తీసుకుంటున్నారు.. ఫలితంగా న్యాయవ్యవస్థ ఓ ఉన్నతమైన వ్యక్తిని ధర్మాసనంపై కూర్చుండబెట్టే అవకాశాన్ని కోల్పోతున్నది’ అని పేర్కొంది. కొలీజియం రెండోసారి సిఫారసు చేసిన పేర్లను కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని తెలిపింది. ఇలా పెండింగ్లో ఉన్నవారిలో ఒకరు ఇప్పటికే మరణించారని పేర్కొంది. ‘సమర్థులైన న్యాయాధికారులు ధర్మాసనంపై ఆసీనులు కాకపోతే.. ఈ విశాలమైన వ్యవస్థలో చట్టం, న్యాయం అన్న భావన ఇబ్బందులకు గురికాక తప్పదు’ అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన సిఫారసులు ఐదు వారాలుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ గుర్తుచేశారని తెలిపింది.
‘దీనిని తాము అర్థం చేసుకోలేకపోతున్నాం లేదా అభినందించలేకపోతున్నాం’ అని అంటూ ప్రస్తుతానికి న్యాయశాఖ కార్యదర్శికి కేవలం నోటీసు మాత్రం పంపుతున్నామని పేర్కొంది. కొలీజియం తమ సిఫారసులను ఏకగ్రీవంగా పునరుద్ఘాటించినప్పుడు.. కేంద్ర ప్రభుత్వం మూడు నుంచి నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దేశంలోని హైకోర్టుల్లో మంజూరైన మొత్తం జడ్జీల సంఖ్య 1,080 కాగా ఇంకా 416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.