Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ మాత్రం సహించకూడదని పేర్కొంది. దేశ పౌరుల తరఫున బాధ్యతగా ఉంటూ ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కోర్టులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఛత్తీస్గఢ్ మాజీ ప్రధాన కార్యదర్శి అమన్ సింగ్, ఆయన సతీమణి యాస్మిన్ సింగ్పై 2020లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం విచారించిన జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ఈ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
హిందూ పురాణాల ప్రకారం.. దురాశ అనేది ఏడు పాపాల్లో ఒకటి. అవినీతి పెరుగుదలకు ఇదే మూలం. ప్రజాసేవలో ఉన్న కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. దురాశతో అవినీతికి పాల్పడుతున్నారు. నేరాలకు పాల్పడే ఇలాంటి వారిపై కోర్టులు కఠినంగా వ్యవహరించాలి.
– సుప్రీంకోర్టు