యావత్మాల్: మహారాష్ట్ర పత్తి రైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ధరలు దారుణంగా పడిపోవడం, కొనేవారు లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వెయ్యి మందికిపైగా రైతులు ఈ గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి అమ్ముడుపోని దాదాపు 1000 క్వింటాళ్ల ముడి పత్తిని తగలబెట్టేందుకుసమాయత్తమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మందికిపైగా రైతులు పత్తి సాగులో ఉన్నారు. గతేడాది క్వింటాలు పత్తి ధర రూ.14 వేలకు చేరుకుంది. ఈసారి అకాల వర్షాలు వారిని నిండా ముంచాయి. దాదాపు 40 శాతం పంట నష్టపోయింది. అంతేకాదు, ఈ ఏడాది ధర కూడా దాదాపు 50 శాతం పడిపోయి రూ. 14 వేల నుంచి రూ. 7 వేలకు తగ్గింది.
పత్తిరైతుల కష్టాలపై శివసేన (యూబీటీ) రైతు నేత కిషోర్ తివారీ మాట్లాడుతూ మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.5 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్టు కిషోర్ తివారీ తెలిపారు. కేంద్రం పుండు మీద కారం చల్లినట్టు మూడు మిలియన్ బేళ్ల పత్తిని దిగుమతి చేసుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడేందుకే కేంద్రం ఇలా చేస్తోందని దుయ్యబట్టారు. 18 నాటి ర్యాలీకి రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయని సీనియర్ నేత విజయ జవంధియా తెలిపారు.