Lok Sabha Elections | న్యూఢిల్లీ, మే 21: దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ – కాంగ్రెస్ కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కొంటున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఏడుకు ఏడు సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ మరోసారి అవే ఫలితాలను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు రాజధానిలోనే బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయాలని, మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆప్ – కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మరో ఏడాదిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలు బీజేపీకి, ఇండియా కూటమికి మరింత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఢిల్లీ ఫలితాలు దేశ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఢిల్లీలో 2004లో ఆరు స్థానాలను, 2009 ఏడు స్థానాలను కాంగ్రెస్ గెలవగా కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2014, 2019లో బీజేపీ క్లీన్స్వీప్ చేయగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీవాసులు ఇచ్చే తీర్పుపై రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆసక్తి నెలకొన్నది.
కొత్త ముఖాలతో బరిలో బీజేపీ
గత రెండు ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ సులువుగా కైవసం చేసుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆప్ – కాంగ్రెస్ కూటమి నుంచి గట్టి పోటీనే ఎదురవుతున్నది. ముఖ్యంగా పదేండ్లుగా ఉన్న ప్రభుత్వంపై సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఈసారి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న మనోజ్ తివారి మినహా మిగతా ఆరుగురు సిట్టింగ్లను మార్చి కొత్త వారికి టికెట్లు ఇచ్చింది.
అయితే, వీరిలో సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ సహా ఎక్కువమంది కొత్త ముఖాలే కావడం ఆ పార్టీకి కొంత నష్టం చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ సహా, ఆ పార్టీ కీలక నేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్పై అవినీతి ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. అలాగే మలివాల్పై దాడి అంశాన్ని కూడా ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఇక, సీఏఏ అమలు, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణాలే ప్రధాన అంశాలుగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తున్నది. బూత్ స్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉండటం బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉన్నది.
ఈసారి ద్విముఖ పోరు
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. 2014లో త్రిముఖ పోటీతో బీజేపీ చాలా లాభపడింది. ఈసారి మాత్రం బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వొద్దని ఆప్, కాంగ్రెస్ భావించాయి. నాలుగు స్థానాల్లో ఆప్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. దీంతో ఏడు స్థానాల్లోనూ బీజేపీకి ఈసారి గట్టి పోటీ ఎదురవుతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మైనారిటీ ఓట్లు, కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు, ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ఉన్న సానుకూల ఓట్లు కలిస్తే బీజేపీని ఓడించడం కష్టమేమీ కాదని ఇండియా కూటమి లెక్కలు వేసుకుంటున్నది. అయితే, రెండు పార్టీల పొత్తును వ్యతిరేకిస్తూ ఏకంగా పీసీసీ చీఫ్గా ఉన్న అర్విందర్ సింగ్ లవ్లీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇరు పార్టీల క్యాడర్ సైతం పూర్తిస్థాయిలో కలిసికట్టుగా పని చేయడం లేదు.
కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు
ఎన్నికల వేళ ఢిల్లీ నెలకొన్న కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపుపై పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పొత్తులో భాగంగా ఆప్కి నాలుగు స్థానాలు విడిచిపెట్టడాన్ని కొందరు నేతలు వ్యతిరేకించారు. ఇంకొందరు పార్టీని వీడారు. ఇక, ఈశాన్య ఢిల్లీ అభ్యర్థిగా కన్హయ్య కుమార్కు టికెట్ కేటాయించడంపైనా అసంతృప్తి ఉంది. ఆయనను స్థానికేతరుడిగా కాంగ్రెస్ క్యాడరే భావిస్తున్నది. గత ఎన్నికల్లో కన్హయ్య తన స్వస్థలమైన బీహార్లో పోటీ చేసి ఓడారు. జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఈశాన్య ఢిల్లీలోనే కాకుండా మొత్తం ఏడు స్థానాల్లోనూ బీజేపీకి ప్రచారాస్ర్తాలుగా మారాయి. ఇక, వాయువ్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ అభ్యర్థిత్వంపై కూడా క్యాడర్లో వ్యతిరేకత ఉంది.
సానుభూతి పవనాలు వీస్తాయా ?
ఆప్ పట్ల ఢిల్లీ ప్రజలు విలక్షణ వైఖరిని కనబరుస్తూ వస్తున్నారు. పార్లమెంటులో ఆ పార్టీని పక్కనపెడుతున్న ఓటర్లు.. వెంటనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆప్కు 32.90 శాతం ఓట్లే వచ్చాయి. ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలవలేదు. ఏడాది లోపే 2015 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్కు 54.3 శాతం ఓట్లు, 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 67 స్థానాలు దక్కాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆప్ కేవలం 18.11 శాతం ఓట్లు సాధించింది. ఒక్క సీటూ దక్కలేదు. ఏడాదిలో వచ్చిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్ 53.57 శాతం ఓట్లతో 62 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్ సహా ఆప్ నేతలను జైలుకు పంపించడాన్ని బీజేపీ చేస్తున్న కక్షసాధింపు చర్యలుగా, ఆప్ లేకుండా చేసే ప్రయత్నంగా ఢిల్లీ ప్రజలు భావిస్తే మాత్రం ఈసారి ఆప్కు అనుకూలంగా సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉందంటున్నారు.