Uttarakhand | డెహ్రాడూన్, ఏప్రిల్ 17: హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు తొలి దశలో భాగంగా ఈనెల 19న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో ప్ర ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నది. గత మూడు లోక్సభ ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. రాష్ట్ర ఓటర్లు ఏదొక జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. 2009లో కాంగ్రెస్ రాష్ట్రంలోని ఐదు స్థానాల ను గెలుచుకోగా.. 2014, 19 సార్వత్రిక ఎ న్నికల్లో మాత్రం ఓటర్లు ఐదు ఎంపీ సీట్లను గంపగుత్తగా బీజేపీకి అప్పగించారు. అయితే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రం లో గతానికి భిన్నంగా స్థానిక అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేసే పరిస్థితి నెలకొన్నది. అగ్నిపథ్పై యువతలో నెలకొన్న అసంతృప్తి, భద్రతపై మహిళల్లో నెలకొన్న ఆందోళన ఎ న్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.
‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ హయాంలో గొప్ప గా అభివృద్ధి చేశామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓవైపు చెప్పుకొంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా జాతీయ అం శాలే తమకు ఓట్లు తెచ్చి పెడుతాయని బీజేపీ భావిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లు తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఈ బిల్లును పాస్ చేయగా.. రాష్ట్రపతి మార్చిలో ఆమోదించారు. దీంతో దేశంలో యూసీసీ చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇదే సమయంలో అయో ధ్య రామ మందిరం అంశం కూడా తమకు లాభిస్తుందని కమలం నేతలు అశిస్తున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం రాష్ట్రంలోని కమలం పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రా ష్ట్రం నుంచి సైన్యంలో గణనీయ సంఖ్యలో యువత చేరుతుంటారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ స్కీమ్పై యువతలో తీవ్ర వ్యతిరేక త నెలకొన్నది. పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం లో పెద్దయెత్తున ఆందోళనలు కూడా జరిగాయి. మరోవైపు రాష్ట్రంలో మహిళల భద్రతపైనా ఆందోళన నెలకొన్నది. అంకిత భం డారీ అనే 19 ఏండ్ల యువతిని రిషికేశ్లోని రిసార్టులో బీజేపీ మాజీ నేత కుమారుడు హ త్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృ ష్టించింది. స్థానిక అంశాలను లేవనెత్తడం ద్వా రా ఓటర్లను తనవైపు తిప్పుకోవడంపై కాం గ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది. నిరుద్యోగం, వలసలు, సిల్క్యారా సొరంగం కూలిన ఘట న వంటి ప్రమాదాలను ప్రస్తావిస్తోంది.
ఐదు లోక్సభ స్థానాలకుగానూ రెండింటిలో బీజేపీ అభ్యర్థులను మార్చింది. ఇందులో గఢ్వాల్, హరిద్వా ర్ ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవాళ్లు ఇద్దరూ రాష్ట్ర మాజీ సీఎంలే కావడం గమనార్హం. గఢ్వాల్ ఎంపీగా ఉన్న మాజీ సీఎం తిరాత్ సింగ్ రావత్, హరిద్వార్ ఎంపీ అయిన మరో మాజీ సీఎం రమేశ్ పోక్రియాల్ నిశాంత్లను ఎన్నికల రేసు నుంచి తప్పించడంపై రాష్ట్రంలో పెద్దయెత్తున రాజకీయ చర్చ నడిచింది.