లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినందున ఐక్యంగా బీజేపీని ఓడించాలనే కసి ప్రతిపక్ష పార్టీల్లో మరింత పెరుగుతుందని చెప్పారు. దేశ ప్రజలు బీజేపీని తుదముట్టించాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం స్పష్టంమైందని, ఒక్క మధ్యప్రదేశ్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయని అఖిలేష్ అన్నారు. కాబట్టి ఈ ఫలితాలను చూసి ఆందోళన చెందాల్సింది బీజేపీనే అని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని మార్చబోతున్నారని జోష్యం చెప్పారు. అధికార బీజేపీపై జనం ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు.