న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: సామాన్యుడి నడ్డివిరుస్తూ రాకెట్ వేగంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్న కేంద్రప్రభుత్వం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేని విధంగా అత్యధిక ఇంధన ధరలు ఒక్క భారత్లోనే ఉండేలా సెట్ చేసింది. అవును. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉండగా, పెట్రోల్ రేటులో మూడోస్థానం, డీజిల్ ధరల్లో ఎనిమిదో స్థానంలో ఉన్నది. కొనుగోలు శక్తి తుల్యత (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ) గణాంకాలతో ఈ విషయాలు వెలుగుచూశాయి.
వేరువేరు దేశాల ఆర్థిక వ్యవస్థని పోల్చి చూడడానికి ఆర్థిక వ్యవస్థ పరిమాణం, తలసరి ఆదాయం లాంటి అంశాలు మాత్రమే సరిపోవు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయాలు రూ. 40 లక్షల రూపాయల స్థాయిలో ఉంటే, భారత దేశ తలసరి ఆదాయం లక్ష దగ్గరే ఉంటుంది. దీన్ని మాత్రమే ఆధారంగా తీసుకుంటే, అమెరికా తలసరి జీవన ప్రమాణాల స్థాయికీ, భారత జీవన ప్రమాణాల స్థాయికి 40 రెట్లు వ్యత్యాసం ఉండాలి. కానీ, అలా ఉండదు. కాబట్టి దాన్ని ఇంకా మెరుగ్గా అంచనా వెయ్యడానికి తీసుకొచ్చిన పరామితినే ఈ పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ). భారత్లో కిలో ఆలుగడ్డలు రూ. 21. అమెరికాలో కిలో ఆలుగడ్డల రేటు 1.94 డాలర్లు (రూ. 147). అంటే కిలో ఆలుగడ్డలను కొనుగోలు చేయాలంటే భారత పౌరుడితో పోలిస్తే ఒక అమెరికన్ ఏడు రెట్లు వెచ్చించాలి.
భారత్లో ఒకపూట భోజనం చేయడానికి రూ. 70 సరిపోతుంది. అమెరికాలో అదే స్థా యి భోజనానికి వాళ్లు 10 డా లర్లు (రూ.758) ఖర్చు చేయాల్సి ఉంటుంది. అ ప్పుడు భారత్లో పూటకి రూ. 70 కొనుగోలు స్థాయి, అమెరికాలో రూ. 758 కొనుగోలు స్థాయికి సమానంఅన్నట్టు పరిగణించాలి. ఇదే పీపీపీ భావన. అమెరికన్ డాలరుకు భారత కరెన్సీ మారకం విలువ ప్రస్తుతం రూ. 75.86గా ఉన్నది. అయితే, అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాల ప్రకారం.. పీపీపీ ఆధారంగా అంతర్జాతీయ డాలర్తో పోలిస్తే భారత కరెన్సీ విలువను ప్రస్తుతం రూ.22.6గా నిర్ణయించారు. అంటే 22.6 రూపాయలు.. ఒక పీపీపీ డాలర్కు సమానమని గ్రహించాలి. పీపీపీ డాలర్ రేట్లను ఆధారంగా చేసుకొని వివిధ దేశాల్లో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ రేట్లను నిపుణులు గణించారు.
ఎల్పీజీ సిలిండర్ ధర ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో ఉన్నది. లీటర్ ఎల్పీజీకి మనం 3.5 పీపీపీ డాలర్లను చెల్లిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే లీటర్ ఎల్పీజీకి బ్రిటన్వాసులు ఒక్క పీపీపీ డాలర్ మాత్రమే చెల్లిస్తుండటం గమనార్హం. పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో ఉన్నది. ఇరాన్ పౌరుడు తన రోజూవారీ జీతంలో పెట్రోల్కు 0.1 శాతాన్ని ఖర్చు చేస్తుండగా, భారతీయుడు రోజూవారీ జీతంలో 23.5% పెట్రోల్ కోసం వెచ్చిస్తున్నాడు. డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో మ నం 8వ స్థానంలో ఉన్నాం. భారతీయుడు రోజూవా రీ జీతంలో 29.9%డీజిల్ కోసం ఖర్చుచేస్తున్నాడు.
కొత్తగా పైండ్లెన జంటకు వారి స్నేహితులు లీటర్ పెట్రోల్, డీజిల్ను బహుమతిగా ఇచ్చారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా చెయ్యూర్ గ్రామంలో ఇటీవల చోటుచేసుకొన్నది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కంటే ఖరీదైన వస్తువు తమకు కనిపించలేదని, అందుకే తమ మిత్రుడి పెండ్లికి పెట్రోల్ బాటిల్ను బహుమతిగా ఇచ్చామని వరుడు గ్రేస్ కుమార్ మిత్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.