Russia Crude oil | న్యూఢిల్లీ, మే 16:ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది కేంద్రం. మరి క్రూడాయిల్ తక్కువ ధరకు దొరికినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి కదా! కానీ, అలా తగ్గడం లేదు. ప్రజలకు దక్కాల్సిన లాభం రెండు ప్రైవేటు కంపెనీలకు దక్కుతున్నది. ఇక్కడే కార్పొరేట్ కంపెనీలపై కేంద్రానికి ఎంత ప్రేమ ఉన్నదో అర్థం అవుతున్నదని విమర్శకులు అంటున్నారు. పశ్చిమ దేశాలు ఒత్తిడికి తలొగ్గకుండా భారత్ రష్యా నుంచి చౌక ధరకు చమురు దిగుమతులను భారీగా పెంచేసింది. అయితే కేవలం రిలయన్స్, నయారా సంస్థల లాభాల కోసమే రష్యా చమురు ఉపయోగపడుతున్నది.
ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా లెక్కల ప్రకారం.. గత నెల(ఏప్రిల్)లో భారత్ సగటున 16.7 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది. ఇది భారత మొత్తం చమురు దిగుమతుల్లో ఏకంగా 36 శాతం. దీంతో భారత్కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుగా రష్యా మారింది.
మన దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ రీఫైనరీలకు ఇతర దేశాలకు పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి లేదు. ప్రైవేటు సంస్థలకు మాత్రం ఇలాంటి ఆంక్షలు ఏవీ లేవు. ఇదే ఇప్పుడు రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీ సంస్థలకు లాభాలపంట పండటానికి కారణమైంది. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయడంతో పశ్చిమ దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశాలు ఎక్కువ ధరకైనా చమురు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆసరాగా చేసుకున్న ఈ కంపెనీలు రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకొని పశ్చిమ దేశాలకు పెట్రోల్, డీజిల్ను ఎక్కువ ధరలకు విక్రయించి భారీగా లాభాలు పొందుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేశానికి, దేశ ప్రజలకు ఒనగూరుతున్న లాభం ఏమీ లేదు.
ఈ మొత్తం వ్యవహారంలో మరిన్ని అనుమానాలు లేవనెత్తుతూ ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇప్పటివరకు దాదాపు 40 మిలియన్ బ్యారెళ్లకు పైగా రష్యా చమురును ముంబై కేంద్రంగా నడుస్తున్న గాటిక్ షిప్ మేనేజ్మెంట్ అనే అనామక కంపెనీ దిగుమతి చేసింది. 2021 నాటికి కేవలం రెండు చమురు నౌకలు మాత్రమే ఉన్న ఈ చిన్న కంపెనీ ఏడాదిలోనే రూ.13 వేల కోట్ల విలువైన 58 చమురు నౌకలను కొనుగోలు చేసి మరీ రష్యా నుంచి చమురు రవాణా చేస్తున్నది. ఇంత చిన్న కంపెనీ ఒకేసారి ఇంత భారీ మొత్తంలో వెచ్చించి చమురు నౌకలను కొని మరీ రష్యా నుంచి చమురు రవాణా చేస్తుండటం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు భారీగా పెంచేస్తూ వస్తున్నది. ప్రతిసారి ధరలు పెంచినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరిగిందని సాకుగా చెప్తున్నది. కానీ, వాస్తవాలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ హయాంలో బ్యారల్ చమురు ధర 106.94 డాలర్లు ఉన్నా దేశంలో పెట్రోల్ ధర రూ.72 ఉండేది. కానీ, ఇప్పుడు బ్యారెల్ ధర 70 డాలర్లకు తగ్గినా పెట్రోల్ ధర మాత్రం రూ.100కు పైగానే ఉన్నది. ఇక, రష్యా ఎంత చౌకగా చమురు ఇస్తున్నదనే వివరాలు కేంద్రం వెల్లడించడం లేదు.