ముంబై, జూలై 17: రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. రైతు సమస్యలపై చర్చించాలన్న ప్రతిపక్షాల వినతిని స్పీకర్ తిరస్కరించడంతో వారు వాకౌట్ చేశారు.
అనంతరం విధాన భవన్ మెట్లపై నిరసన తెలిపారు. దివంగత పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు నివాళులర్పించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మహా వికాస్ అఘాడీ నేతల సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్, శివసేన (యూబీటీ) నేత అనిల్ పరాబ్ వెల్లడించారు.