Manipur Violence | (స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు. సాయుధ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ జాతీయ క్రీడాకారుడు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటీవల జరిగిన ఇద్దరు విద్యార్థుల హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై సాయుధ బలగాలు విరుచుకుపడ్డాయి.
నిరసనకారులను చెదరగొట్టేందుకు ముందస్తు హెచ్చరికలు లేకుండాలని పెల్లెట్ గన్నులతో జవాన్లు కాల్పులు జరపగా.. జాతీయ క్రీడాకారుడు ఉత్తమ్ సాయిబామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలలో 61 మేకులు దిగాయి. ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తిరిగి అతడు మైదానంలో దిగుతాడో లేదో తెలియడం లేదు. కాగా, అతని తల ఎక్స్రే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీజేపీ సర్కార్పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనతో మైతీ వర్గీయులు కూడా బీజేపీకి దూరమవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. సీఎం బీరేన్సింగ్ వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేసింది. సాయుధ దళాలు రాష్ట్ర పరిధిలోకి రావని, వారిని నియంత్రించే అధికారం తనకు లేదని ఆయన చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
విద్యార్థులను చెదరగొట్టేందుకు పెల్లెట్ గన్ను (మేకులను ఉపయోగించి కాల్పులు జరిపే తుపాకులు)లను వాడటం తగదు. ముందస్తు హెచ్చరికలు చేయాలి. రబ్బరు బులెట్లు, స్మోక్ బాంబులు, పెద్దగా శబ్దం చేసే మాక్ బాంబులు వాడి నిరసనకారులను అదుపులోకి తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ఆయుధాలను విద్యార్థులపై ప్రయోగించడమేంటి.
– బబ్లూ లోయిటోంగబామ్, సామాజిక కార్యకర్త