న్యూఢిల్లీ, జూలై 2: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే శరద్ పవార్కు ఫోన్ చేసి తమ మద్దతు తెలిపారు.
ఎన్సీపీలో చీలిక ప్రతిపక్షాలు కూటమికి పెద్ద ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ చీలిక వారిలో ఆందోళన కలిగిస్తున్నది. రాజకీయాలలో కురువృద్ధుడైన శరద్ పవార్ జరుగుతున్న పరిణామాలపై గంభీరంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయనలోనూ ఆందోళన ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది.