ఛత్రపతి శంభాజీనగర్/ముంబై, అక్టోబర్ 30: మరాఠా కోటా ఉద్యమం హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు సోమవారం ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో బీడ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు. కోటా అమలు కోసం ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టడాన్ని చిన్నపిల్లల ఆటగా ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి అభివర్ణించడంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీడ్ జిల్లాలోని ప్రకాశ్ సోలంకి ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అనంతరం రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న ఓ కారుకు కూడా నిప్పంటించారు.
బీడ్లోని మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సందీప్ క్షీరసాగర్ నివాసంపైనా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటికి, సమీపంలో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బీడ్ జిల్లాలోని మజల్గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనం మొదటి అంతస్తుకు కూడా నిప్పుపెట్టారు. అలాగే ఆదివారం నుంచి సోమవారం నాటికి దాదాపు 13 ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. దీంతో 30 డిపోలలో సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగే నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది. వైద్య పరీక్షలకు ఆయన నిరాకరిస్తున్నారు. మరోవైపు కోటా విషయంలో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలుకు సలహా ఇవ్వడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు.
మరాఠాలకు రిజర్వేషన్లపై మాటమార్చిన బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇద్దరు శివసేన (షిండే వర్గం) ఎంపీలు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. మరాఠా కోటా అమలు జేయాలని డిమాండ్ చేస్తూ హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తన రాజీనామా పత్రాన్ని న్యూఢిల్లీలో లోక్సభ సెక్రెటరీకి సమర్పించగా, నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. షిండే వర్గ ఎంపీల రాజీనామా అంతా పొలిటికల్ స్టంట్గా ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కొట్టిపారేశారు.