Congress | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో హామీల వర్షం కురిపింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రిజర్వేషన్ల 50 శాతం పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ, దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణ, అగ్నిపథ్ స్కీమ్ రద్దు తదితర హామీలు గుప్పించింది. ఈ మేరకు ‘న్యాయ్ పత్ర’ పేరిట శుక్రవారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. జమ్ముకశ్మీర్, పుదుచ్చేరిలకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నది.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రూ.25 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం, మహాలక్ష్మీ పథకం కింద దేశంలోని పేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నది. ఉపాధి హామీ పథకం కింద రోజుకు ఇచ్చే కూలీని రూ.400 చేస్తామని ప్రకటించింది.