చండీఘడ్, మే 26: లోక్సభ ఎన్నికల్లో దేశమంతా ఒకరకమైన రాజకీయ చిత్రం ఉంటే పంజాబ్ ఎన్నికల సంగ్రామం మాత్రం మరో రకంగా ఉంది. మిగతా అన్ని రాష్ర్టాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రధాన పోటీదారుగా ఉంటే పంజాబ్లో మాత్రం ఇండియా కూటమిలోనే ప్రధాన పోటీ నెలకొన్నది. 13 లోక్సభ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ – కాంగ్రెస్ మధ్యనే నెలకొన్నది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇక, 1996 తర్వాత పంజాబ్లో మొదటిసారి ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ ఇక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా రైతుల నిరసనలు బీజేపీ అభ్యర్థులకు సెగలు పుట్టిస్తున్నాయి.
గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించింది. 13 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా పోటీ చేసిన శిరోమణి అకాలీదళ్ రెండు స్థానాలను, బీజేపీ రెండు స్థానాలను, ఆప్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పంజాబ్పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగినప్పటికీ పంజాబ్లో మాత్రం సీట్ల పంపిణీ కుదరకపోవడంతో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్కు ఆప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40.12 శాతం ఓట్లను సాధించినప్పటికీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం 22.98 శాతానికి పడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు పార్టీతో అంటీముట్టనట్టు ఉండటం కాంగ్రెస్కు మైనస్గా మారింది. ఈసారి కచ్చితంగా ఓటుబ్యాంకును పెంచుకోవాలని, గత ఎన్నికల్లో సాధించిన సీట్ల సంఖ్యను నిలుపుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నది.
ఢిల్లీ తర్వాత ఆప్ బలంగా ఉన్నది, అధికారం చేపట్టింది పంజాబ్లోనే. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఆప్కు చేదు ఫలితాలు దక్కాయి. ఆ పార్టీ కేవలం 7.38 శాతం ఓట్లతో ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. కానీ, మూడేండ్లలోనే అనూహ్యంగా పుంజుకొని 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు, 92 స్థానాలను దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ మొత్తం 13 స్థానాలను దక్కించుకునేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందుకే, ఐదుగురు రాష్ట్ర మంత్రులను, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికల బరిలో నిలిపింది. ఢిల్లీలో ఎన్నికలు ముగిసే వరకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక్కరే ప్రచార బాధ్యతలు మోయగా, తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రైతుల ఓట్లపై ఆప్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే, మహిళలకు నెలకు రూ.1,000 హామీ నెరవేర్చకపోవడం, సింగర్ సిద్ధూ మూసేవాలా అంశం ఆప్కు ప్రతికూలంగా మారాయి.
పంజాబ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన శిరోమణి అకాలీదళ్ క్రమంగా బలహీనంగా మారిపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు, 18 శాతం ఓట్లకు పార్టీ పరిమితమైంది. దీంతో లోక్సభ ఎన్నికలు అకాలీదళ్కు జీవన్మరణ సమస్యగా మారాయి. అకాలీదళ్కు ప్రధాన బలమే గ్రామీణ ప్రాంతాలు, రైతుల ఓట్లు. అయితే, కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల ప్రభావం బీజేపీతో పాటు అకాలీదళ్పై కూడా భారీగానే పడింది. కాగా, అకాలీదళ్ కనుక మెరుగైన ఓట్లను సాధించగలిగితే, కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్ల చీలిక ఆ పార్టీకి కలిసిరావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అకాలీదళ్ చీలిక వర్గం శిరోమణి అకాలీదళ్(అమృత్సర్) కూడా 13 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ చీల్చే ఓట్లు అకాలీదళ్కు మైనస్గా మారనున్నాయి.
పంజాబ్లో మొదటి నుంచి బీజేపీ పాత్ర పరిమితంగానే ఉండేది. మూడు దశాబ్దాలుగా శిరోమణి అకాలీదళ్ వేలు పట్టుకొని నడుస్తున్న కమలం పార్టీ ఈసారి ఒంటరిగా బరిలో దిగుతున్నది. రైతుల ఆగ్రహాన్ని ఇక్కడ బీజేపీ చవిచూస్తున్నది. బీజేపీ అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తగులుతున్నాయి. మోదీ ఇమేజ్, హిందూ ఓటు బ్యాంకు, అర్బన్ ప్రాంతాల్లో ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. బీజేపీ ప్రధానంగా గత రెండు ఎన్నికల్లో గెలిచిన హోషియార్పూర్, ఐదుసార్లు గెలిచిన గుర్దాస్పూర్తో పాటు అమృత్సర్, జలంధర్, లూధియానా, ఫరీద్కోట్, పాటియాలా స్థానాలపైనే దృష్టి సారించింది.
పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లోనూ ఆప్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నది. ఈ రెండు పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచినా అవి ఇండియా కూటమి ఖాతాలోనే పడతాయి. దీంతో పంజాబ్ సీట్ల సంఖ్యపై ఇండియా కూటమి చాలా ఆశలు పెట్టుకుంది. పలు స్థానాల్లో శిరోమణి అకాలీదళ్ కూడా ఈ పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నది. బీజేపీ ప్రధానంగా పంజాబ్లో సొంత కాళ్లపై నిలబడే శక్తిని కూడగట్టుకోవడానికి, రెండంకెల ఓట్ల శాతాన్ని పొందడంపైనే ఆశలు పెట్టుకుంది. ఇక, ఖదూర్ సాహిబ్ నియోజకవర్గంపై కూడా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం అస్సాం జైలులో ఉన్న ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ ఇక్కడి నుంచి మైక్ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున కుటుంబసభ్యులు, అనుచరులు ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో అమృత్పాల్ ఏ మేరకు ఓట్లు సాధిస్తారనేది ఇక్కడ ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.