సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఈ సారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెజార్టీ రాకున్నా ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు.. హిమాచల్లోనూ అదే ఫార్ములాను అమలుచేయాలని చూస్తున్నట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులకు ప్రలోభాల వల విసురుతున్నట్టు తెలిసింది.
మొత్తం 68 అసెంబ్లీ సీట్లున్న హిమాచల్ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ సారి అధికార బీజేపీగానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ గానీ ఈ మార్కును అధిగమించకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. బీజేపీకి 24 నుంచి 41, కాంగ్రెస్కు 20 నుంచి 40 సీట్ల వరకు రావచ్చని సర్వేల అంచనా. ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పాత్రే కీలకమవుతుంది. దీంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
స్వతంత్రుల మద్దతెవరికో?
మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ సంప్రదించాయని, తాము అధికారికంగా ఫలితాలు వెలువడే వరకు అన్ని అవకాశాలను తమ వద్దే అట్టిపెట్టుకుంటామని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన బీజేపీ తిరుగుబాటుదారులు కేఎల్ థాకూర్, మనోహర్ ధిమన్ తెలిపారు. తాను తిరుగుబాటుదారుడిని కాదని, ప్రజల అభ్యర్థినని రామ్సింగ్ పేర్కొంటూ.. ఏ పార్టీకి మద్దతు తెలపాలో డిసెంబర్ 8 తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 మంది బీజేపీ రెబెల్ అభ్యర్థులు సహా మొత్తం 91 మంది స్వతంత్రంగా పోటీచేశారు.