శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 రాజ్యాంగ నిబంధనను 2019లో కేంద్రం రద్దుచేసిన తర్వాత అక్కడ తొలిసారి ఎన్నికలు జరుగబోతున్నాయి. రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారిన జమ్ముకశ్మీర్లో ఈసీ తాజా నిర్ణయం రాజకీయ దుమారం రేపుతున్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ దొడ్డిదారిన తన ఓటర్లను జమ్ముకశ్మీర్లోకి రప్పించేందుకే ఈ నిబంధన తీసుకొచ్చారని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ నేతలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
మన దేశంలో ఓటు హక్కు ఉన్న పౌరులు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో అయినా ఓటు వేయొచ్చని రాజ్యాంగం చెప్తున్నది. కానీ, జమ్ముకశ్మీర్కు ఆర్టికల్ 370 రక్షణ ఉన్నంతకాలం ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఆ రాష్ట్రంలో ఆస్తులు కొనాలన్నా, ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా కశ్మీరీలకు మాత్రమే హక్కు ఉండేది. 2019లో 370 ఆర్టికల్ను కేంద్రం రద్దుచేసింది. దీంతో కశ్మీర్కు ఆ ప్రత్యేక హక్కులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ తాజా నిర్ణయం తీసుకున్నది.