Left Parties | న్యూఢిల్లీ, మార్చి 24: ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి లెఫ్ట్ పార్టీలు క్రమంగా ప్రాబల్యాన్ని కోల్పోతున్నాయి. చివరికి సీపీఎం కూడా జాతీయ పార్టీ హోదాను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వామపక్షాలకు ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. దీంతో ఈ లోక్సభ ఎన్నికలు లెఫ్ట్ పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఇందులో సత్తా చాటకపోతే వాటి మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షంగా ఉన్నది.
కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేరళలో మాత్రం విడిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా, గత లోక్సభ ఎన్నికల్లో యూడీఎఫ్ 19 స్థానాలు కైవసం చేసుకోగా, ఎల్డీఎఫ్ ఒక్కసీటుకే పరిమితమైంది. ఒక్క సీటునూ గెలవని బీజేపీ కూడా ఈసారి సత్తా చాటాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇక సుదీర్ఘ కాలం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండి.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కోటగా మారిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఒంటరిగానే పోరాడుతున్నది. ఇక్కడ సీపీఐ 16 మంది అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్తో పొత్తుకోసం ఎదురుచూస్తున్నది. 2019 ఎన్నికల్లో సీపీఐ కేవలం ఒక్క శాతం ఓట్లను కూడా పొందలేకపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటుబ్యాంకును మూడు శాతానికి పెంచుకుని 16 ఎమ్మెల్యే స్థానాలను వామపక్షాలు గెలుచుకున్నాయి.
ప్రస్తుత లోక్సభలో సీపీఐ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అరవై ఏండ్ల చరిత్రలో ఇంత తక్కువ సంఖ్యలో వామపక్షాల బలం ఎన్నడూ లేదు. 1990 నుంచి 2009 వరకు జాతీయ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ హయాంలో ప్రధాని పదవి కూడా దక్కే అవకాశమొచ్చింది. 2004లో ఒక్క సీపీఎం నుంచే 43 మంది ఎంపీలు, 10 మంది సీపీఐ ఎంపీలు, ఏఐఎఫ్బీ, ఆర్ఎస్పీ తరఫున ముగ్గురేసి ఎంపీలు లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత నుంచే వామపక్షాల ప్రభావం క్షీణించటం మొదలైంది. 2009 నుంచి 2019 మధ్య లెఫ్ట్ పార్టీల పతనం శరవేగంగా సాగింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ చేతిలో, 2018లో త్రిపుర అసెంబ్లీలో బీజేపీ చేతిలో లెఫ్ట్ పార్టీలు ఓటమి చవిచూశాయి.
కేరళ, తమిళనాడులో సిట్టింగ్ ఎంపీలున్న సీపీఎం, సీపీఐలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేతో జతకట్టిన వామపక్షాలు కేవలం రెండేసి సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నాయి. బీహార్లో భారీ ఆశలే పెట్టుకున్నాయి. జార్ఖండ్లో జేఎంఎంతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నది. చాలా రాష్ర్టాల్లో లెఫ్ట్ పార్టీలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికే తంటాలు పడుతున్నాయి. ఇక సీట్లు దక్కించుకోవడం ఆ పార్టీలకు పెద్ద సవాలే. బెంగాల్లో టీఎంసీ తర్వాత ప్రధాన పార్టీగా బీజేపీ అవతరించటంతో వామపక్షాల ఉనికి అక్కడ నామమాత్రంగా మారింది.