న్యూఢిల్లీ, నవంబర్ 21: నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రూ.752 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)తోపాటు దాన్ని నిర్వహిస్తున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్టు ఈడీ వర్గాలు ప్రకటించాయి. ఏజేఎల్కు చెందిన ఆస్తుల విలువ రూ.661 కోట్లు ఉంటుందని తెలిపాయి. పెట్టుబడులు, ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్ ఇండియాకు రూ.90.21 కోట్లు అక్రమ మార్గంలో చేరాయని ఈడీ పేర్కొన్నది.
ఈ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అతడి సోదరుడు ఎంపీ డీకే సురేష్, పవన్ బన్సల్లను ఈడీ నిందితులుగా పేర్కొన్నది. అవసరమైతే కాంగ్రెస్ నాయకుల్ని మళ్లీ విచారణకు పిలిచే అవకాశముందని ఈడీ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఏజేఎల్ ప్రచురణకర్తగా ఉంది. తాజా పరిణామంపై కాంగ్రెస్ స్పందించింది. ‘అల్పమైన ప్రతీకార వ్యూహాలు కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేవు. బీజేపీ భాగస్వామ్య పక్షంగా దర్యాప్తు సంస్థ ఈడీ వ్యవహరిస్తున్నది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు.