CM Arvind Kejriwal | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఓ వైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ కోర్టుకు ఫిర్యాదు.. మరోవైపు తాను బీజేపీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు.. మొహల్లా క్లినిక్కుల ల్యాబ్ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏసీబీ అధికారుల ప్రకటన. మొత్తంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన దాడిని ఉధృతం చేసింది! ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నోటీసులు స్వయంగా సీఎం కేజ్రీవాల్కే ఇస్తామంటూ ఢిల్లీ పోలీసులు శనివారం సీఎం సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసం వద్ద కొన్ని గంటలపాటు హైడ్రామా నడిచింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఒక్కోఆప్ ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఇచ్చి..ఏడుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కేజ్రీవాల్ గత వారం ఆరోపించారు.
దీనిపై బీజేపీ నుంచి ఫిర్యాదు అందడంతో ఆరోపణలపై ఆధారాలు చూపాలంటూ నోటీసు జారీ చేయడానికి క్రైం బ్రాంచ్ బృందం ఆయన నివాసానికి చేరుకుంది. నోటీస్ కేజ్రీవాల్ పేరుపై ఉంది కాబట్టి స్వయంగా దానిని ఆయనకే అందజేస్తామని ఏసీపీ స్థాయి అధికారి పట్టుబట్టారు. అందుకు నిరాకరించిన సీఎం నివాస సిబ్బంది..నోటీసును తమకే ఇవ్వాలని, అది అందుకున్నట్టు రసీదు ఇస్త్తామని తెలిపారు. దీంతో దాదాపు ఐదు గంటలపాటు సీఎం ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఢిల్లీ పోలీసులకు, సీఎం సిబ్బందికి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఆ సమయంలో నివాసం బయట ఉన్న ఆప్ లీడర్ జాస్మిన్ షా పోలీసుల చర్యను తప్పుబట్టారు.
సీఎం నివాసం ఎదుట డ్రామా కోసమే వీరిలా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే సీఎం కార్యాలయంలో నోటీసులు అందజేయలేదని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. చివరికి..సీఎం సిబ్బందికి నోటీసులు అందజేస్తూ ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కావటం లేదని, సమన్లు స్వీకరించటం లేదని ఇక్కడి ఓ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిబ్రవరి 7న విచారణ చేపడతామని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రా తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవినీతిలో మకుటం లేని మహరాజు అని, నిత్యం పరారీలోనే ఉంటారని బీజేపీ ఆరోపించింది. సీఎం ఇంటి వద్ద శనివారం జరిగిన పరిణామాలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఐదుసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించకుండా, ఈడీ ముందు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని ఆరోపించారు.
దాదాపు 65 వేల మందికి నకిలీ రోగులకు మొహల్లా క్లినిక్లలో గత ఏడాది రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వెల్లడించింది. రెండు ప్రైవేటు ల్యాబ్లు గతేడాది ఫిబ్రవరి-డిసెంబర్ మధ్య దాదాపు 22 లక్షల పరీక్షలు జరిపాయని, వీటిలో 65 వేల పరీక్షలు నకిలీవని, తప్పుడు డాటాతో వాటిని సృష్టించాయని అధికారులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ పరీక్షలు చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆ ల్యాబ్లకు రూ.4.63 కోట్లు చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు.