న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదివారం మరికొన్ని ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని వెల్లడించింది. ఈ బాండ్లు 2019 ఏప్రిల్ 12 కన్నా ముందు నాటివని తెలిపింది. ఈ తేదీ తర్వాత కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను గత వారం ప్రకటించింది.
తాజా ప్రకటన తెలిపిన వివరాల ప్రకారం, 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అప్పట్లో సీల్డ్ కవర్లో ఈసీకి సమర్పించాయి. ఈ కవర్లను తెరవకుండానే, యథాతథంగా సుప్రీంకోర్టుకు ఈసీ సమర్పించింది. వీటి కాపీలను తన వద్ద ఉంచుకోలేదు. ఈ నెల 15న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ సీల్డ్ కవర్లను తిరిగి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈసీకి అందజేసింది. ఈ సమాచారాన్ని ఈసీ తన వెబ్సైట్లో ప్రచురించింది.