న్యూఢిల్లీ, డిసెంబర్ 13: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 6,509.56 కోట్లు ప్రకటనల కోసం వెచ్చించిం ది. ప్రింట్ మీడియాకు రూ.3,248.77 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.3,260.79 కోట్ల ప్రకటనలు ఇచ్చినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఈ ప్రకటనలు ఇచ్చినట్లు చెప్పారు. సీపీఎం ఎంపీ ఎం.సెల్వరసు అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 7 నాటికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు ప్రకటనల కోసం రూ.168.8 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రింట్ మీడియాకు రూ.91.96 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.76.84 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు.