న్యూఢిల్లీ, డిసెంబర్ 19: మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. బాస్మతీయేతర బియ్యం ధరల్ని తగ్గించే అంశంపై మంగళవారం కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. బియ్యం ధరలు తగ్గించాలని రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి రావాలని పరిశ్రమ వర్గాలకు జారీచేసిన ఆదేశాల్లో కేంద్రం పేర్కొన్నది. ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కేంద్ర కార్యదర్శి సంజీవ్ చోప్రా బాస్మతీయేతర రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన ముఖ్య ప్రతినిధులతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
బియ్యం రిటైల్ ధరల్ని సమీక్షించాలని, వాటి ధరల్ని సరైన స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రతినిధులను ఆదేశించారు. ఈ అంశాన్ని తమ యూనియన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని ఇండస్ట్రీ అసోసియేసన్స్కు నిర్దేశించారు. ఖరీఫ్ దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్నది సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. టోకు వ్యాపారులు, రిటైలర్స్ లాభాల మార్జిన్ భారీగా పెరిగిన సంగతి ప్రస్తావనకు రాగా, దీనిని వెంటనే నియంత్రించాలని పరిశ్రమ ప్రతినిధులను కేంద్రం ఆదేశించింది. బియ్యం ఎంఆర్పీకి, రిటైల్ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని, దీనిని సరిచేస్తే బియ్యం ధరలు తగ్గేందుకు అవకాశముందని సమావేశంలో పలువురు పేర్కొన్నారని తెలిసింది.