(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించటంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం, ధరల పెరుగుదల వంటివి త్వరలో జరగనున్న 5 రాష్ర్టాల ఎన్నికల్లో ప్రభావం చూపుతావని బీజేపీ భావిస్తోంది. కర్ణాటకలో ఓటమి కారణాలను సమీక్షించుకున్న తర్వాతే కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించిందని తెలుస్తోంది. అయితే తెలంగాణతో సహా త్వరలో జరగనున్న 5 రాష్ర్టాల ఎన్నికలతో పాటు రానున్న ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ధరల పెరుగుదల వల్ల ఓటర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని బీజేపీ పెద్దలకు సర్వే రిపోర్టులు అందినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రజల దృష్టి మళ్లించేందుకే తెరపైకి జమిలి…
ధరల నియంత్రణలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమవడం వల్లనే 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. ఆ ఎన్నికలకు ముందు కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత కనిపించింది. ఆదే పరిస్థితి ఇప్పుడు బీజేపీ సర్కార్ ఎదుర్కొంటున్నదని పలు సర్వేలు చెబుతుండటంతో బీజేపీకి ఎన్నికల భయం పట్టుకుంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్కాల్ అంటూ బీజేపీ ఊదరగొడుతున్నా.. పేదలపై తమ ప్రచార ఆర్భాటాలు పనిచేయటం లేదని ఆ పార్టీ పెద్దలకు రిపోర్టులు అందుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న పలు రాష్ర్టాలలో కూడా గత ఐదేండ్ల కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో, ప్రజల వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కావటం లేదు. ప్రస్తుతం కూడా దేశంలో ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరింది. అంతేకాకుండా గత ఎనిమిదేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది దేశంలో 11 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో పప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటాయి. వీటికి తోడు ధరలు తగ్గించటానికి కేంద్రం బియ్యం, గోధుమలపై నిషేధం విధించటం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో మోదీ సర్కారుకు దిక్కుతోచడం లేదు. అందుకే ధరల పెరుగుదల లాంటి ముఖ్యమైన సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికలతో పాటు పలు అంశాలను తెరపైకి తెస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొవిడ్ నుంచే ఇంకా కోలుకోలే…
భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం ఉందంటూ ప్రభుత్వాధినేతలు చెబుతున్నవన్నీ బూటకాలేనని ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ మోదీ లాంటి వారు వాదిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో దేశ జనాభాలోని 70 శాతం మంది ఇంకా కోలుకోలేదని వివిధ రిపోర్టులు చెబుతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ కూడా తన సర్వే రిపోర్టులో పెరిగిన ధరల పట్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని పేర్కొంది.
భిన్నంగా వాస్తవ పరిస్థితులు…
జీ20 సమావేశాల నేపథ్యంలో విశ్వగురు, ప్రపంచానికి మార్గదర్శి అంటూ బీజేపీ నేతలు ప్రధాని మోదీని ఆకాశానికెత్తేస్తున్నా.. వాస్తవానికి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తున్నది. నిత్యావసర ధరల పెరుగుదలతో మోదీ పాలనపై సామాన్యులు గుర్రుగా ఉన్నారు. మోదీ చేస్తున్న అమృత్కాల్ ప్రచారంతో రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందో లేదోనని బీజేపీ నేతలు ఆందోళనపడుతున్నారు.