Petrol Price | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పెట్రో ధరల పెంపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. భారత్ పొరుగు దేశాలు, పశ్చిమ దేశాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్పై తాము పెంచింది చాలా తక్కువని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి పార్లమెంట్లో చెప్పుకొచ్చారు. ఈ మేరకు భారత్తో పాటు వివిధ దేశాల పెట్రో పెంపు గణాంకాల పట్టికను వెలువరించారు. అయితే, పార్లమెంట్లో మంత్రి ఉదహరించిన దేశాల జాబితాను, పెంపు కాలవ్యవధిని పరిశీలిస్తే కేంద్రం అసలు కుట్ర ఏమిటో అర్థమవుతుంది.
పొరుగు దేశాలు: పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్
పశ్చిమ దేశాలు: అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, కెనడా.
పాకిస్థాన్, బంగ్లా, శ్రీలంక, నేపాల్.. గత రెండు, మూడేండ్లుగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దీంతో నిత్యావసర ధరలతో పాటు అక్కడ పెట్రో రేట్లు భారీగా పెరిగాయి. అయినప్పటికీ బంగ్లా, లంక, పాక్లో లీటర్ పెట్రోల్ మన కరెన్సీ మారకంలో వరుసగా రూ. 98, రూ. 97, రూ.73 మాత్రమే. అయితే, సంక్షోభం లేని భారత్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.109గా ఉన్నది.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఐరోపా, అమెరికా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, కెనడా తదితర దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమ దేశాల నుంచి ఆర్డర్లు రాకపోవడంతో రష్యాలో చమురు నిల్వలు పేరుకుపోయాయి. ఇదే అదునుగా భారత్.. రష్యా చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకొన్నది. ఆ లెక్కన దేశీయంగా పెట్రో ధరలు దిగిరావాలి. అయితే, డిస్కౌంట్ ప్రయోజనాన్ని పౌరులకు చేరకుండా కేంద్రం ఖజానాను నింపుకొన్నది.
విదేశాలతో పెట్రో రేట్లను పోలుస్తూ.. మంత్రి జూన్ 2021- జూన్ 2023 మధ్య వ్యవధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నారు. ఎందుకంటే ఈ వ్యవధిలో ఆయా దేశాల్లో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడి పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఏ దేశాల్లోనైతే చమురు ధరలు పెరిగాయో.. ఆ దేశాలనే మంత్రి వల్లెవేశారు. అయితే.. గడిచిన తొమ్మిదేండ్ల బీజేపీ హయాంలో దేశంలో ఏ మేరకు చమురు ధర పెరిగిందన్న విషయాన్ని మంత్రి పక్కన బెట్టారు. గడిచిన తొమ్మిదేండ్లలో పెట్రోల్ ధరపై 51.3 శాతం, డీజిల్పై 76.3% పెంచారు.