Mathura Mosque | ప్రయాగ్రాజ్, డిసెంబర్ 14: ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణజన్మభూమి-షాహీఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. జ్ఞానవాపీ మసీదు తరహాలోనే షాహీ ఈద్గా మసీదుపై కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు అంగీకరించింది. ఉత్తరప్రదేశ్లోని మథురలో వందల ఏండ్ల కిందట హిందూ ఆలయాన్ని కూల్చివేసి షాహీ ఈద్గా మసీదును నిర్మించారని, దానిని తిరిగి హిందువులకు అప్పగించాలని భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ మరో ఏడుగురు వ్యక్తులు కోర్టుకెక్కారు. దీంతో చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. అది మొదట్లో హిందూ ఆలయం అవునో కాదో తేల్చాలని భారత పురావస్తు శాఖను స్థానిక కోర్టు గతంలో ఆదేశించింది.
ప్రాథమిక సర్వే నిర్వహించిన ఏఎస్ఐ.. పూర్తి సర్వేకు మరికొంత సమయం కావాలని కోరింది. ఆ సమయంలో ఈ వివాదంపై వివిధ కోర్టుల్లో దాఖలైన కేసులన్నీ హైకోర్టు తనకు బదిలీ చేసుకొన్నది. అనంతరం వీటిని విచారించిన జస్టిస్ మయాంక్కుమార్ జైన్ ధర్మాసనం.. తీర్పును నవంబర్ 16న రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం తీర్పు వెల్లడిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు పర్యవేక్షణలో సర్వే జరుగుతుందని తెలిపింది. ఇందుకోసం అడ్వొకేట్ కమిషనర్ను నియమించనున్నట్టు చెప్పింది. దీనిపై ఈ నెల 18న మరోసారి విచారణ జరిపి పూర్తి వివరాలు చర్చిస్తామని కోర్టు పేర్కొన్నది. షాహీఈద్గా మసీదు కిందనే శ్రీకృష్ణుడి జన్మస్థానం ఉన్నదని పిటిషనర్లు వాదిస్తున్నారు.
షాహీ ఈద్గా మసీదులో సర్వేకు హైకోర్టు అనుమతించడంపై మసీదు కమిటీ స్పందించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని షాహీఈద్గా మసీదు నిర్వహణ కమిటీ సెక్రటరీ, న్యాయవాది తన్వీర్ అహ్మద్ తెలిపారు. మసీదు కమిటీ నిర్ణయాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్వాగతించింది. కమిటీకి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని తెలిపింది.
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు విషయంలోనూ సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాశీ విశ్వనాథ్ దేవాలయం పక్కనే ఉన్న ఈ మసీదులో పురావస్తు శాఖ సర్వే చేపట్టింది. అయితే సర్వే నివేదికను ఇంకా కోర్టుకు సమర్పించాల్సి ఉన్నది.