థాణె, సెప్టెంబర్ 10: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు చేస్తున్న ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్నది. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై ఇటీవల జాల్నాలో పోలీసుల అమానుష లాఠీచార్జికి నిరసనగా సోమవారం థాణేలో బంద్ నిర్వహించాలని సంభాజీ బ్రిగేడ్ మద్దతు ఇస్తున్న సకల్ మరాఠా మోర్చా ఆదివారం పిలుపునిచ్చింది. ఈ బంద్కు మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్, మరాఠా క్రాంతి మోర్చా ప్రకటించాయి.
కాగా, ఓబీసీ కోటా కింద తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠాలు గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జాల్నాలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంలో వందలాది మంది గాయపడ్డారు.