ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి మహారాష్ట్ర అధికారులు సతమతమవుతుంటే ముంబై మహానగరానికి సమీపంలోని చిన్న గ్రామం కొవిడ్-19 తమ గ్రామంలో ఎవరికీ సోకకుండా 15 నెలలుగా నివారించగలిగింది. మార్చి 2020లో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి థానే జిల్లాలోని కల్బోందే గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా హాట్ స్పాట్ గా మారిన ముంబైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోనే థానే ఉన్నప్పటికీ ఈ చిన్న గ్రామం మహమ్మారికి అడ్డుకట్ట వేయడంలో సఫలమైంది.
1560 మంది నివసించే కల్బోందే గ్రామం ముంబై మెట్రొపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలోనే ఉన్నా మహమ్మారి ఈ గ్రామం దరిదాపుల్లోకి రాలేదు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లు వ్యాప్తి చెందినా తమ గ్రామంలో సున్నా కేసులు నమోదయ్యాయని తాము ఇదే స్ఫూర్తితో థర్డ్ వేవ్ కు సన్నద్ధమవుతున్నామని గ్రామ సర్పంచ్ దేవకి ఎం ఘెరా చెప్పారు. కరోనా కట్టడికి5 తాము థానే జిల్లా అధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడంతో పాటు బయట ప్రపంచంతో తమ గ్రామానికి సంబంధాలు లేకుండా చూసుకున్నామని సర్పంచ్ తెలిపారు. 11 మందితో కూడిన గ్రామ విజిలెన్స్ కమిటీ కరోనా మహమ్మారి నుంచి గ్రామస్తులను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని వెల్లడించారు.