న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ టెస్లా కంపెనీ ఇండియాలో తన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే, అప్పుడు ఆ కంపెనీకి కూడా లాభాలు దక్కుతాయని మంత్రి గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెట్రోల్ వాహనాల కన్నా తక్కువ ధరకే అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన అన్నారు. అగర్ టెస్లా ఇండియా మే ఎలక్ట్రిక్ కార్ మ్యానిఫ్యాక్చర్ కరేగా తో ఉన్కా బీ ఫయిదా హోగా అంటూ ఆయన తెలిపారు.
టెస్లా కంపెనీ తమ కార్లను ఇండియాలో ఉత్పత్తి చేస్తే తమకు ఎటువంటి సమస్య లేదని, కానీ ఆ కార్లను చైనా నుంచి మాత్రం ఆ కంపెనీ దిగుమతి చేయరాదు అని మంత్రి గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇండియాలో టెస్లా ఉత్పత్తికి మస్క్ సిద్ధంగా ఉంటే సమస్యలేదని, ఇండియాకు రావాలని, ఇక్కడ ఉత్పత్తి స్టార్ట్ చేయాలని, ఇండియా పెద్ద మార్కెట్ అని, వాళ్లు ఇండియా నుంచి ఎగుమతి చేయవచ్చు అని మంత్రి గడ్కరీ ఇటీవల పేర్కొన్నారు.