Poonch Attack | జమ్ము, డిసెంబర్ 21: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంఛ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ వాహనాలపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టెర్రరిస్టుల ఏరివేత ఆపరేషన్ కోసం డేరా కీ గలీ ప్రాంతానికి అదనపు సైనికులను తీసుకెళుతుండగా ధత్యర్ మోర్హ్ వద్ద ఈ దాడి జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్, జిప్సీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, సైనికులకు చెందిన ఆయుధాలను వారు ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు బుధవారం రాత్రి నుంచి డేరా కీ గలీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తుండగా ముష్కరులు ఆకస్మిక దాడికి దిగినట్టు వివరించారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. పూంఛ్ జిల్లాలో బుధవారం ఒక పోలీస్ యూనిట్ ప్రాంగణంలో పేలుడు సంభవించిన తర్వాత ఈ ఉగ్ర దాడి జరగడం గమనార్హం. గతంలో పలుమార్లు ఇదే ప్రాంతంలో ఈ తరహా కాల్పులు జరిగాయని ఆర్మీ తెలిపింది. గత రెండేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లలో 35 మంది సైనికులు చనిపోయారని వెల్లడించింది.