Terror attacks : దేశంలో ఉగ్రవాదులు (Terrorists) దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence sources) హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని తెలిపాయి. రైల్వేశాఖ (Railway department) అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరగవచ్చని అనుమానం వ్యక్తంచేశాయి. నదీ మార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని తెలిపాయి.
ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఇంటెలిజెన్స్ నుంచి ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా ముంబైకి చేరుకొని.. సీఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది.
ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్లు అమరులయ్యారు. తహవ్వూర్ రాణా పాకిస్థాన్కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో అతను కీలక సూత్రధారి.